హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల మందల వద్ద పల్లె నిద్ర చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి భువనగిరి వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో గొర్రెల మంద వద్ద లబ్ధిదారులతో కలిసి రాత్రి నిద్ర చేశారు. ఉదయం వరకు అక్కడే ఉన్న ఆయన లబ్ధిదారులతో మాట ముచ్చట నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకంపై లబ్ధిదారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు గొర్రెల పంపిణీ పథకంపై సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలతో జీవనోపాధి లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో జీతగాళ్లుగా ఉన్న తాము గొర్రెల పంపిణీ పథకంతో సొంతంగా జీవించగలుగుతున్నామన్నారు. గొర్రెలతో మంచి ఆదాయం వస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులు తొలుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా లబ్ధిదారులకు చైర్మన్ హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చైర్మన్ బాల్రాజు తెలిపారు.