న్యూఢిల్లీ, నవంబర్ 29: ఫ్రీడం బ్రాండ్నేమ్తో వంటనూనెల్ని విక్రయించే హైదరాబాదీ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పచ్చజెండా ఊపింది. జెమిని ఎడిబుల్స్ సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇందులో తాజా ఈక్విటీ షేర్ల జారీ ఉండదు. ప్రస్తుత ప్రమోటర్లు, షేర్హోల్డర్లు…వారి వద్దనున్న వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్గా విక్రయించడానికే ఐపీవోను ఉద్దేశించారు.
మరో 9 కంపెనీలకూ అనుమతి..
జెమిని ఎడిబుల్స్తో పాటు మరో 9 కంపెనీల ఆఫర్లకు సెబీ అమోదం తెలిపింది. రక్షణ పరికరాల తయారీ సంస్థ డాటా పేట్రన్స్, డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్మై ఇండియా, పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్, ఏటీఎంల నిర్వహణా సంస్థ ఇండియా1 పేమెంట్స్, హెల్త్కేర్ కంపెనీలు హెల్తియం మెడ్టెక్, వీఎల్సీసీ హెల్త్కేర్, ఫుట్వేర్ రిటైలర్ మెట్రోబ్రాండ్స్, షుగర్ రిఫైనింగ్ సంస్థ గోదావరి బయోరిఫైనరీస్లు ప్రతిపాదించిన ఐపీవోలను సెబీ అనుమతించింది.