సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కుక్ కొలువు పేరిట మహిళలకు మాయమాటలు చెప్పి ఆభరణాలను దోచుకుపోతున్న అంతరాష్ట్ర ఘరానా దొంగతో పాటు ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న మరో ఇద్దరు పాత నేరగాళ్లను సౌత్, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు చేసిన 13 కేసులను ఛేదించి, వారి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన అఫ్తబ్ అహ్మద్ షేక్ అలియాస్ అఫ్తబ్ తన 11 ఏండ్ల వయస్సులో హైదరాబాద్కు వలస వచ్చాడు. 2006 నుంచి నేరాలు చేయడం మొదలు పెట్టాడు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఇతడిపై 41 దొంగతనం కేసులు ఉన్నాయి. లైంగిక దాడి కేసులో జైలు శిక్ష పడటంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ జైలులో జైలు శిక్ష అనుభవించాడు. ఇదిలా ఉండగా. గ్రామీణ ప్రాంతాలు, నగరాల్లోని బస్తీల్లోకి వెళ్లి వాయిదాల పద్ధతిలో గృహోపకరణాలు అమ్ముతూ మహిళలతో మాటలు కలుపుతుంటాడు.
ఈ క్రమంలోనే తనకు తెలిసిన ధనవంతుల ఇంట్లో వంట మనిషి కావాలని అడుగుతున్నారని, భారీ జీతం ఇవ్వడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని నమ్మిస్తాడు. అతడి మాటలు నమ్మి అతడితో కలిసి వెళ్లిన వారికి ఓ పెద్దింటిని చూపిస్తాడు. ఇదే ఇంట్లో ఉద్యోగం. ఇక్కడ సూపర్వైజర్తో మాట్లాడుదామంటూ అక్కడి వరకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలోనే మీ ఒంటిపై బంగారు ఆభరణాలు ఉంటే డబ్బున్న వారు అనే బావన వాళ్లకు వస్తుంది. ఉద్యోగం ఇవ్వడానికి సంకోచిస్తారు. నీ ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని సూచిస్తాడు.
దీంతో బాధితురాలు ఆభరణాలు తీసిన తరువాత నా దగ్గర దాచిపెట్టుకుంటానం టూ నమ్మించి వాటిని తీసుకుంటాడు. అక్కడే బాధితుల కండ్లు కప్పి అక్కడి నుంచి పరారవుతుంటాడు. ఒక ఊరిలో ఒక దొంగతనం చేశాడంటే ఇక ఆ ఊరు వెళ్లడు. ఈస్ట్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఈ ఘరానా దొంగకు సంబంధించిన సమాచారం అందడంతో నల్లకుంట, మారేడ్పల్లి పోలీసులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో తాజాగా 7 నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
మహారాష్ట్రకు చెందిన షేక్ మొబిన్ పహాడిషరీఫ్ ప్రాంతంలో, అవినాష్ అమాన్ జోగదేకర్ బోరబండ ప్రాంతంలో నివాసముంటున్నారు. దొంగతనాలు చేయడంలో ఇద్దరు నిందితులు ఆరితేరారు. 14 కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ దొంగలు పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తుంటారు. రైల్వే ట్రాక్ సమీపంలోని తాళం వేసిన ఇండ్లను పగటి పూట గుర్తించి, ఆ ఇండ్లలో రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేసి తాజాగా ఆ కేసులు ఛేదించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, రాఘవేంద్ర, నల్లకుంట అదనపు ఇన్స్పెక్టర్ కిషన్, మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ విజయ్ తదితర సిబ్బంది ఉన్నారు.