ఖైరతాబాద్, డిసెంబర్ 16: ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రదర్శన అధ్యక్షుడు, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ చెప్పారు. ఏపీలోని విజయవాడలో కూడా జనవరి ఒకటి నుంచి 12 వరకు బుక్ ఫెయిర్ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్తోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆహ్వానించామని పేర్కొన్నారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన బుక్ఫెయిర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుక్ ఫెయిర్కు చిందు యక్షగానం విద్వాంసురాలు పులిగంటి ఎల్లమ్మ పేరుతో ‘చిందు ఎల్లమ్మ వేదిక’గా నామకరణం చేశామని చెప్పారు. ధ్వని అనుకరణ సమ్రాట్ దివంగత నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణం కూడా పెడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో బుక్ ఫెయిర్ కోశాధికారి రాజేశ్వరావు,కార్యదర్శి కే చంద్రమోహన్, సహాయ కార్యదర్శి శోభన్బాబు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, సభ్యులు సూరిబాబు, మాజీ కార్యదర్శి విభా భారతి తదితరులు పాల్గొన్నారు.