సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అక్షరాల విత్తనాలు చల్లి మానవతా వృక్షాలను పెంచాలని ‘ఆకుపచ్చని అక్షరం’ కవి సమ్మేళనంలో పాల్గొన్న యువకవులు పిలుపునిచ్చారు. బుధవారం 34వ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుక్తంగా తెలంగాణ కళా భారతిలో చిందు ఎల్లమ్మ వేదికపై నిర్వహించిన ఆకుపచ్చని అక్షరం విద్యార్థి కవి సమ్మేళనంలో సిటీ కాలేజీ విద్యార్థులతో పాటు నగరంలోని ఇతర కళాశాల విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
తాము రాసిన కవిత్యాన్ని పుస్తక, సాహిత్య ప్రియులతో పంచుకున్నారు. ముఖ్యఅతిథిగా కవి యాకూబ్ హాజరై మాట్లాడారు. తాను ఊరూరా కవిసంగమం కార్యక్రమం చేశానన్నారు. యువకులు బాగా చదివితేనే కవులు, రచయితలు కాగలరని అన్నారు. ప్రపంచంపై అవగాహన కల్పించేది, బాధపడేవారికి స్వాంతన చేకూర్చేది కవిత్వమన్నారు. మనిషిని మనిషిగా మార్చేది కవిత్వమని, కవిత్వం, కళలతోనే ఆదర్శపౌరులుగా ఎదుగుతారని అన్నారు.
మెర్సీ మార్గరేట్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, పసునూరి రవీందర్, తెలుగుశాఖ అధ్యక్షురాలు అవధానం సుజాత, కవి, అధ్యాపకుడు డాక్టర్ కోయి కోటేశ్వర్రావు, డాక్టర్ జె.నీరజ ప్రసంగించారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్ పి.బాలభాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీనిధి వ్యవహరించింది. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్, మనోహర నాయకుడు, యువ కవులు కె.శ్రీధర్, మౌనిక, స్పందన, అభిలాష్, సాయికుమార్, మంజూష, కె.స్వాతి పాల్గొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘అతిథిగా ఉండి అవని విడిచి వెళ్తాను’ అన్నాడు కాళోజీ.. ‘భూమి నాది అనినా.. భూమి పక్కున నవ్వు’ అని వేమన అన్నాడు. అందుకే ప్రకృతిని కాపాడాలని మన పూర్వీకులు పేర్కొన్నారని ప్రముఖ కవి, రచయిత, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. జమ్మి పంచుకుంటే ఎంత ఆనందమో.. పుస్తకాలను పంచుకుంటే అంతే ఆనందం కలుగుతుందన్నారు. బుధవారం తెలంగాణ కళాభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో దేశపతి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడారు.
కవులు, రచయితలను గౌరవించుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. తెలంగాణలో పర్యావరణం కోసం సీఎం కేసీఆర్ హరితహారం నిర్వహిస్తుండగా.. ఎంపీ సంతోష్ కుమార్ ముందుకు తీసుకు వెళ్తున్నారని గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ అన్నారు. ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ 46 వేల మొక్కలను నాటినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ జాగృతి, తెలుగు ప్రపంచ వేదిక ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం ఓఎస్డీ దేశపతి సందర్శించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ జె.నీరజ, కవి సీతారాం, బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ పసునూరి శ్రీధర్బాబు రచించిన ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ అనే కవితా రెండో సంపుటిని చిందు ఎల్లమ్మ వేదికపై ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి కె.కేశవరెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి యాకూబ్, ఏలె లక్ష్మణ్, మెర్సీ మార్గరేట్ తదితరులు హాజరై పుస్తక సమీక్ష చేశారు.
పుట్టుక నీ ఒడిలోనే! మరణం నీ ఒడిలోనే!
లేనివాడికి కూర్చునే కుర్చీ కావచ్చు,
లేనివాడికి నీడనిచ్చే కోవెల చెట్టు.
గాలి నిచ్చి ప్రాణం నిలుపుతావు.
నీడనిచ్చి దేహాన్ని కాపాడుతావు.
అన్నీ తానై ఆదరించే పచ్చని చిగురుటాకువు.
ఆకుపచ్చని సూరీడుగా నిలుస్తున్న నిన్ను మదినిండా తలుచుకుంటం. – అపర్ణ, యువ కవయిత్రి
నా కన్న తల్లి పాలుపోసి పెంచింది.
నా తరువు తల్లి వాయువుతో ఆయువు పారిస్తున్నది.
కన్నతల్లి కల్పవళ్లి లాగా నీడనిస్తూ..
ఎంతోమందికి ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఆదరిస్తున్నది.
పూలూ.. పండ్లు.. నీడా.. నువ్వే ఈ జగత్తుకు ఆయువు పట్టు. – అభిలాష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్
వన సంరక్షణ, చెట్టు బహుముఖ విశిష్టత, కాలుష్య రహిత సమాజా నికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనిషికి చెట్టే నిజమైన నేస్తం. ఆకులా రాలి కొత్త చిగురై పలుకరిస్తుంది. అట్లాగే యువత కూడా పర్యావరణ పరిరక్షణతో పాటు సాహిత్య పరిమళాలను పంచాలి..- స్వాతి, యువ కవయిత్రి