సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. నిత్యం వేలాదిమంది బుక్ ఎగ్జిబిషన్కు వస్తున్నారు. ఈ-పుస్తకాలు అందుబాటులో ఉన్నా.. తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కొని చదివేస్తున్నారు. పుస్తకం ద్వారా చదివితేనే ఎక్కువ సంతృప్తి నిస్తుందంటున్నారు. బుక్ఫెయిర్ను సాహితీ ప్రియులే కాదు.. విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రముఖులు సందర్శిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తుండడంతో పుస్తక ప్రదర్శన సాహిత్య జాతరను తలపిస్తున్నది. మంగళవారం పుస్తక ప్రదర్శనను ప్రముఖ కవి, రచయిత, సినీనటుడు తనికెళ్ల భరణి సందర్శించారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తనికెళ్ల భరణిని స్వాగతించారు.
తనికెళ్ల భరణి ‘తెలంగాణ విజయగాథ’ స్టాల్ను సందర్శించారు. పుస్తక ప్రదర్శనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూలూరి గౌరీశంకర్ రచనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై అచ్చయిన పుస్తకాలను పరిశీలించారు. అనంతరం తనికెళ్ల మాట్లాడుతూ.. ఉత్తమ రచయితల్లో జూలూరి ఒకరని కొనియాడారు. సాహిత్యమనేది చాలా విశాలమైనదని, కవులు, రచయితలకు ఎల్లలు లేవని ఆయన పేర్కొన్నారు. రచనలు, కవిత్వం ఎప్పుడూ ఆగిపోయేది కాదని అన్నారు. నిరంతరం సాగిపోయే నావ లాంటిదని తెలిపారు. పుస్తక ప్రదర్శనకు హాజరైన యువ రచయితలను అభినందించారు. వివిధ స్టాల్స్లోని పులికొండ సుబ్బాచారి రచించిన తెలుగుల వైభవం, కడలి సత్యనారాయణ రచించిన కడలి పుస్తకాలను పరిశీలించారు.
షాద్నగర్ పరిధిలోని రాంనగర్ నుంచి సెమీ ఆర్ఫాన్స్ (తల్లి లేదా తండ్రి లేని చిన్నారులు) చిల్డ్రన్ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి మంచి పుస్తకం స్టాల్ను సందర్శించి తమకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేశారు. పెద్ద చేప, నక్కబావ అప్పడాల కర్ర లాంటి పుస్తకాలు వారిని అమితంగా ఆకట్టుకున్నట్టు తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియా ఇటీవల అబద్ధాల ప్రపంచంగా తయారైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో మంగళవారం పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన ‘సామాజిక మాధ్యమాల ఉధృతి అధ్యయన ఆవశ్యకత’ అనే అంశంపై చర్చా వేదికలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ సోషల్ మీడియా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఫేక్ అంశాలను పక్కన పెట్టాల్సిందేనని కోరారు. అనంతరం టీఎస్పీఎస్సీ మాజీ చైర్మర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సోషల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువ వైరలవుతుందని అన్నారు. సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి ప్రతి రోజు ఒక గంట పాటు పుస్తక పఠనం చేయాలని ఆయన సూచించారు. అసత్య ప్రచారాలు పార్లమెంటు నుంచి సాధారణ ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందని వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, బుక్ ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్, సిటీ కాలేజీ ఉపాధ్యాయురాలు నీరజ, కోయి కోటేశ్వర్రావు, ఎండీ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకమే తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిందని, ఎక్కువగా నేను ఆటో బయోగ్రఫీ పుస్తకాలను చదువుతానని అన్నారు. పుస్తక ప్రదర్శనకు చాలా ఏండ్ల తర్వాత రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. చరిత్ర, బయోగ్రఫీ, కెరీర్కు సంబంధించిన పుస్తకాలు ఒకే చోట దొరకడం వల్ల అందరూ ఆదరిస్తారన్నారు. పుస్తకాలు చదివే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించామని పేర్కొన్నారు.
పుస్తక ప్రదర్శనలో మంగళవారం చిందు ఎల్లమ్మ వేదికగా డాక్టర్ బి.సారంగపాణి రచించిన ‘ఆంగ్లేయుల ఏలుబడిలో అంతులేని దోపిడీ’ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ జనప వెంకటరాజం ఆవిష్కరించారు.
సీనియర్ జర్నలిస్టు కొండూరి వీరయ్య రచించిన ‘రష్యా విప్లవంలో రైతాంగం’ అనే పుస్తకాన్ని చిందు ఎల్లమ్మ వేదికపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్య బాంగ్య, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, బుక్ ఎగ్జిబిషన్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఎగ్జిబిషన్ కోశాధికారి రాజేశ్వర్, తంగిరాల చక్రవర్తితో కలిసి ఆవిష్కరించారు.