హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఆర్చిబిషప్ పూల ఆంథోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను కార్డినల్గా చేస్తూ క్యాథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. కార్డినల్గా హోదా పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఆంథోనీ. అంతేకాదు ఆ హోదాను దక్కించుకున్న తొలి దళిత క్రిస్టియన్ కూడా ఈయనే కావడం విశేషం. కార్డినల్గా నియమితులైన పూల ఆంథోనీ ఇక కాలేజ్ ఆఫ్ కార్డినల్స్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే పోప్ ఎన్నికల్లో పూల ఆంథోనీ తన ఓటు హక్కును వాడుకునే అవకాశం ఉంటుంది.
ఆంథోనీ వయసు 62 ఏళ్లు. ఆయన స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా. కర్నూలు డయోసీలో 12 ఏళ్లు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆర్చిబిషప్గా పోప్ ఫ్రాన్సిస్ చేత నియమితులయ్యారు.ఇండియా నుంచి కార్డినల్గా నియమితులైన మరో వ్యక్తిగా గోవా ఆర్చిబిషప్ ఫిలిప్ నెర్రి ఆంటోనియో సెబాస్టియో డీ రొజరీ ఫెరారో ఉన్నారు.
కార్డినల్గా మారడం తెలుగు ప్రాంతానికి ఓ అరుదైన గుర్తింపు అని ఆంథోనీ అన్నారు. ఏపీ, తెలంగాణలో చర్చి విశ్వాసాన్ని ప్రజల్లో పెంచనున్నట్లు ఆయన తెలిపారు. పూల ఆంథోనీకి కార్డినల్గా హోదా ఇవ్వడం పట్ల తెలుగు క్యాథలిక్ బిషప్ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. క్యాథలిక్ చర్చి చరిత్రలో కార్డినల్ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. పోప్ తర్వాత కార్డినల్ హోదా రెండవ పెద్ద టైటిల్గా భావిస్తారు.
దళితుడిని కార్డినల్గా ప్రకటించడం పట్ల దళిత సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆ సంఘాలు వెల్లడించాయి. భారత్లో 60 శాతం మంది క్రైస్తవుల్లో దళితులే ఉన్నట్లు తెలిసిందే. కొత్తగా ఇద్దరికి కార్డినల్ హోదా ఇవ్వడంతో భారత్లో వారి సంఖ్య ఆరుకు చేరుకున్నది. ఆగస్టు 27వ తేదీన కొత్త కార్డినల్స్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాలేజ్ ఆఫ్ కార్డినల్స్లో మొత్తం 229 మంది ఉంటారు. వీళ్లంతా కొత్త పోప్ను ఎన్నుకుంటారు.