శేరిలింగంపల్లి, అక్టోబర్ 30: హైబిజ్ టీవీ హెల్త్కేర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. శనివారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో వైద్యరంగంలో 29 విభాగాల్లో విశిష్ట సేవలందించిన వైద్యులు, వైద్యశాలలకు పురస్కారాలను అందజేశారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన వైద్యులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి శాంతా బయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురికి అవార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రోగికి మందులు 10 శాతమే పని చేస్తాయని.. ఆప్యాయతతో కూడిన పలకరింపుతోనే రోగం పూర్తిగా నయం అవుతుందన్నారు. చిన్నచిన్న సమస్యలకు మందులు వాడొద్దన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలందిస్తున్న డాక్టర్లను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లైఫ్ టైం అవార్డును ఏఐజీ వైద్యశాల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, ఉత్తమ ఆర్థోపెడిక్ అవార్డును సన్షైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గురువారెడ్డిలు అందుకున్నారు. కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి, నటి కామ్నా జెఠ్మాలణి, నందిత శ్వేత, డాక్టర్ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.