న్యూఢిల్లీ: మనుషుల్లో నమోదు అయ్యే అన్ని రకాల వ్యాధుల(Human Diseases)ను నిర్మూలించే ఉద్దేశంతో చాన్ జుకర్బర్గ్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. 2100 సంవత్సరం నాటికి అన్ని వ్యాధులకు చెందిన డేటా బేస్ను తయారు చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. చాన్ ఫౌండేషన్కు చెందిన చాన్ జుకర్బర్గ్ ఇన్సియేటివ్(సీజెడ్ఐ) దీనిపై ప్రకటన చేసింది. 2100 నాటికి కంప్యూటింగ్ సిస్టమ్ను డెవలప్ చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశోధకులు ఆ డేటాను స్టడీ చేసి వ్యాధుల నిర్మూలనకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్లు సీజెడ్ఐ తెలిపింది.
మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిశ్చిల్లా చాన్ దీనిపై తాజాగా ప్రకటన చేశారు. కణాలను క్యాటలాగ్ చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై స్టడీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ డేటాను వ్యాధుల చికిత్సకు సంబంధించిన కీలకమైన ఆవిష్కరణలకు వాడుకోనున్నట్లు తెలిపారు. ఈ శతాబ్ధం చివరలోగా అద్భుతమైన ఆవిష్కరణలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయోమెడిసిన్లో ఎన్నో అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు.
కణాలను అధ్యయనం చేసే సామర్థ్యం ఉన్న డిజిటల్ మోడల్స్ను డెవలప్ చేస్తున్నామని, దీని ద్వారా పరిశోధకులు మన కణాల ప్రవర్తనను అంచనా వేయగలరని, వ్యాధుల సమయంలో కలిగే పరివర్తనలను గుర్తించగలరని జుకర్బర్గ్ తన ప్రటకనలో తెలిపారు. ఆరోగ్యకరమైన, వ్యాధి సోకిన కణాలను ఏఐ ద్వారా స్టడీ చేయనున్నట్లు చెప్పారు.