జైపూర్ : రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో రెండు లారీలు ఢీకొట్టుకొని మంటలు చెలరేగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు చిక్కుకొని సజీవ దహనమయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి నంబర్-8పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టైల్స్ పౌడర్ లోడ్తో ఉన్న లారీ జైపూర్ నుంచి బీవార్ వెళ్తోంది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బీవార్ నుంచి జైపూర్ వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలకు అంటుకున్నాయి. లారీల్లో డ్రైవర్లతో పాటు మరో ఇద్దరు అందులోనే చిక్కుకొని మృతి చెందారు.
మరో వ్యక్తి లారీలో నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నాడు. రెండు లారీలకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనాల్లో చిక్కుకున్న నలుగురు మృతి చెందారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది.