హైదరాబాద్, మే6 (నమస్తే తెలంగాణ): విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ సూపరింటెండెంట్పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. సంపూర్ణ విచారణకు స్కూల్ ఉన్నతాధికారులకు సీఎంవో కార్యాలయ అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. విద్యార్హతలు లేకున్నా ప్రమోషన్లను పొంది, 35 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తూ, అనుమతుల్లేకుండా విదేశీ పర్యటనలు చేస్తుండడమేగాక, హోంలోని నిజాం సంపదను పక్కదారి పట్టిస్తున్నారని హోం సూపరింటెండెంట్పై 20 రోజుల క్రితమే పూర్వవిద్యార్థులు సీఎంవో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘విక్టోరియా హోంలో నయా రూల్’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో సీఎంవో ప్రత్యేక దృష్టిని సారించి సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
వీఎం హోమ్ సూపరింటెండెంట్పై పూర్వ విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని సీఎంవో హోం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. హోమ్ సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి ఉద్యోగ అర్హతలు, పాస్పోర్ట్ తనిఖీ, పదోన్నతులు? వాటికి ఆర్థికశాఖ అనుమతులున్నాయా? లేవా? హోంలోని నిజాంసంపద తదితర అంశాలపై ఆరా తీయాలని ఉన్నతాధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సెలవులో ఉన్న సూపరింటెండెంట్ను కూడా హుటాహుటిన రావాలని ఆదేశించినట్టు సమాచారం. నేడు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా హోమ్కు వచ్చి విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది.
పూర్వ విద్యార్థుల ఫిర్యాదు, పత్రికల్లో కథనాల నేపథ్యంలో వీఎం హోం రెసిడెన్షియల్ స్కూల్ హానరరీ సెక్రటరీ కిషన్ సోమవారం ఉదయం హోంను సందర్శించారు. హోం సూపరింటెండెంట్ సెలవులో ఉండడంతో హోం ప్రిన్సిపల్తోపాటు, ఇతర సిబ్బందితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లాకర్స్ రిజిస్టర్పై సిబ్బంది మధ్య కొనసాగుతున్న వాదులాటపై కూడా ఆరా తీశారు. పర్మినెంట్ రిజిస్టర్ ఎవరి వద్ద ఉంది? తదితర అంశాలపై విచారించగా సిబ్బంది తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. పూర్తిస్థాయి వివరాలను అందించాలని ఆదేశించినట్టు సమాచారం.