బెంగళూరు, మార్చి 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదని, హిజాబ్ధారణ తప్పనిసరి అని పేర్కొంటూ ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. ఈ మేరకు తరగతి గదుల్లో హిజాబ్ ధారణకు అనుమతినివ్వాలంటూ ఉడిపికి చెందిన కొందరు ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నిబా నాజ్ అనే ఓ ముస్లిం స్టూడెంట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ యాద్గిర్లోని ఓ ప్రభుత్వ పీయూ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను విద్యార్థులు బాయ్కాట్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ధారణపై గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. హిజాబ్ ధరించిన విద్యార్థినులను కళాశాలల్లోకి అనుమతించకపోవడం, హిజాబ్ ధారణను వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు రావడంతో పలుచోట్ల నిరసనలు జరిగాయి. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో మతపరమైన వస్త్రధారణలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో స్కూళ్లలో హిజాబ్ధారణను అనుమతించాలంటూ కొందరు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై దాదాపు పక్షం రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది.
హిజాబ్ లేకుండా కాలేజీలకు పోబోం
హిజాబ్ను ధరించకుండా తాము కాలేజీలకు వెళ్లబోయేది లేదని ఉడిపిలోని ముస్లిం విద్యార్థినులు తేల్చిచెప్పారు. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. మాతృభూమిలోనే తమకు నమ్మకద్రోహం జరిగిందన్నారు. న్యాయం దొరికేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
ముక్కలుగా నరికిపారేస్తాం: ఐసిస్
హిజాబ్ వివాదంపై ఉగ్రవాద సంస్థ ఐస్లామిక్ స్టేట్ (ఐసిస్) తాజాగా స్పందించింది. ముస్లిం మహిళలను అగౌరవపరిచే హిందువులను ఓ కంట కనిపెట్టి నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా నరికిపారేస్తామని హెచ్చరించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం వెనుక బీజేపీ ఉన్నదని ఆరోపించింది.
కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు
టీచర్లు, పాఠాలు, యూనిఫాం లేకుండా స్కూలింగ్ అనేది పరిపూర్ణం కాదు. హిజాబ్ను స్కూల్ యూనిఫాంగా అనుమతిస్తే, అసలైన యూనిఫాం మరుగునపడిపోతుంది. యూనిఫాం అనేది మొఘ ల్స్, బ్రిటీషర్లు తీసుకొచ్చింది కాదు. ప్రాచీనకాలంలో గురుకులాల నుంచి ఇది ఉన్నది.
పాఠశాలల్లో యూనిఫాం ధారణ సహేతుకమైన పరిమితే. దీనిపై విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. రాజ్యాంగబద్ధంగా కూడా దీన్ని ఎవరూ సవాల్ చేయలేరు.
హిజాబ్ ధరించని వారు పాపాత్ములని ఏ మతం ప్రభోదించలేదు. హిజాబ్ను స్కూళ్లలో అనుమతిస్తే, దాన్ని ధరించే విద్యార్థినులు ఒకవర్గంగా, ధరించని వారు మరో వర్గంగా మారొచ్చు. సామాజిక వేర్పాటువాదానికి ఇది దారితీయొచ్చు.
హిజాబ్ వివాదాన్ని చూస్తే సమాజంలో అశాంతి, సామరస్యానికి భంగం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తున్నది. వారెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.