సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : వాణిజ్య కనెక్షన్ల బిల్లుల జారీ, వసూలు ఆన్లైన్ ద్వారా జరపాలని నిర్ణయించినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేరొన్నారు. దశల వారీగా ఈ ప్రక్రియను ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 100శాతం ఆన్లైన్లో బిల్లులు జారీ చేసి, ఆన్లైన్ ద్వారానే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో ఎండీ దానకిశోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే నాన్ డొమెస్టిక్ (వాణిజ్య) కనెక్షన్లను గుర్తించి, జియో ట్యాగింగ్ చేసినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ కనెక్షన్లకు ఆన్లైన్లో బిల్లులు జారీ చేసి, డిజిటల్ పద్ధతిలో వసూలు చేసే విధానంపై కమిటీ వేసి అధ్యయనం చేయించినట్లు చెప్పారు. వాణిజ్య కనెక్షన్లకు ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా పూర్తిగా ఆన్లైన్లో బిల్లులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బిల్లులు కూడా ఆన్లైన్లోనే వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించి క్రమంగా ఏప్రిల్ 1 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వివరించారు.
మీటరు పని చేయని, మీటరు లేని వాణిజ్య, హైవాల్యూ కనెక్షన్లకు కచ్చితంగా మీటరు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి లోపు వీరంతా కచ్చితంగా ఏఎంఆర్ మీటర్లు అమర్చుకునేలా చూడాలని పేరొన్నారు. వాణిజ్య కనెక్షన్ల బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, కచ్చితంగా బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, సీజీఎం రెవెన్యూ, జీఎంలు, ఎన్ఆర్డబ్ల్యూ డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.