ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12: నేటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు- చరిత్ర ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘మన ఊరు-మన చరిత్ర’ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ ఊరి గురించి, భౌగోళిక విశిష్టతలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. చరిత్రకారులకు దొరకని అంశాలను, వీర తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలను రికార్డు చేయాలని చెప్పారు. వృత్తిదారుల జీవితాల్లో వచ్చిన మార్పుల వంటి వాటి గురించి కూర్చి రచనలు చేయాలని పిలుపునిచ్చారు.