HomeNewsHighlights From The Cm Kcr Presidential Address
సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసంలో ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థికశాఖలో ఉండే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం అనేకరంగాల్లో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నది.
తొలిదశ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టిన పంజాబ్ను తలదన్ని 3 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్.
మీరు పండించే పంటను మేం కొనలేమని ఎఫ్సీఐ అనేస్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నం. ఇది ఏడేండ్లలో తెలంగాణ సాధించిన ఘనత.
తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ దేశంలోనే మొదటి, రెండో స్థానంలో ఉన్నది.
కరోనా లాంటి మహమ్మారి పీడించినా.. 90 రోజులు లాక్డౌన్లో ఉన్నా..ఆ పరిస్థితులను అధిగమించి 11.5% గ్రోత్తో దేశంలోనే తొలిస్థానంలో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నది.
పల్లెప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తున్నది.
సాగునీటి రంగంలో సాధించిన విజయాలు ప్రజల స్వానుభవంలో ఉన్నవి. కరువుకు ఆలవాలమైన ఆలేరు, భువనగిరి, జనగామ, సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాలు, ముంబై బస్సులకు ఆలవాలమైన పాలమూరు జిల్లా ప్రాంతాలకు పక్క రాష్ట్రం నుంచి కూలీలు వచ్చి పనిచేసే స్థితికి మన తెలంగాణ ఎదిగింది.
పండించిన ధాన్యం పట్టడానికి తెలంగాణ రైస్మిల్లులు సరిపోవడం లేదు. మోసేందుకు తెలంగాణ హమాలీ బిడ్డలు సరిపోవడం లేదు. పెద్దపల్లి, మిర్యాలగూడ, సూర్యాపేట.. ఎక్కడికి వెళ్లినా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తున్నారు.
ఈ రోజు తెలంగాణలో 12,769 గ్రామపంచాయతీల్లో అద్భుతమైన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఇంటికి నిరంతరంగా మంచినీళ్లు వస్తున్నాయి. చెక్డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి.
మిషన్ కాకతీయ ఫలితంతో భారీవర్షాలు కురుస్తున్నా.. ఏ జిల్లాలో కూడా ఒక్క చెరువు తెగిపోలేదు.
పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఐటీలో మన ఖ్యాతి దూసుకెళ్తున్నది. రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతుల నుంచి నేడు రూ.1.50 లక్ష కోట్లకు చేరింది.
కులాలు, మతాలు అన్న తేడా లేదు. తెలంగాణ సమాజ అభివృద్ధే మన మతం..తెలంగాణ సర్వజనుల ముఖాలపై చిరునవ్వే మన అభిమతం. కులం, మతం అనే ఇరుకైన భావన లేకుండా అందర్నీ కడుపులో పెట్టుకొని సాగాలన్న అద్భుతమైన ప్రస్థానమే ఈ రోజు అంతటా కనిపిస్తున్న విశ్వాసం. బతుకుమీద పెరిగిన ధీమా. భవిష్యత్తుపై పెరిగిన ఆశలు ఈ తెలంగాణ సమాజంలో సజీవంగా కనిపిస్తున్నాయి. ఇదే కదా మనం ఆశించింది.