బీర్భూమ్ ఘటనపై బెంగాల్ సర్కారుకు హైకోర్టు ఆదేశం
కోల్కతా, మార్చి 23 : పశ్చిమబెంగాల్ని బీర్భూమ్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్కత్తా హైకోర్టు ఆదేశించింది. టీఎంసీ నేత భదు హత్యకు గురికావడం.. అందుకు ప్రతీకారంగా కొందరు దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సాక్షులకు భద్రత కల్పించాలని, ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇలాంటి ఘటనలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఎక్కువ: మమత
బీర్భూమ్ ఘటన దురదృష్టకరమని, 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని పశ్చిమబెంగాల్ సీఎం మమత చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడే.. అది కూడా బెంగాల్లోనే జరిగినట్టు కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్లలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని, బాధితుల కుటుంబాలను గురువారం కలుస్తానని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.