కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): అన్ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లు చేయడాన్ని ఏవిధంగా కట్టడి చేస్తున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకునికి, సీబీఎస్ఈకి, తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘానికి, స్వతంత్ర యాజమాన్య సంఘానికి నోటీసులు జారీచేసింది. ఫీజుల నియంత్రణ విషయంలో హైదరాబాద్ సూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కేవీ సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఫీజుల నియంత్రణకు యంత్రాంగమే లేదని, ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు పేరుతో అడ్డగోలుగా ఇతర ఫీజులను కూడా వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అధికంగా వసూలు చేసిన ఫీజుల నుంచి 40% మొత్తంతో కొవిడ్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.