హైదరాబాద్ : రాష్ట్రంలో కోర్టుల్లో అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. కరోనా ఉధృతి తగ్గడంతో ఈ నెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈ నెల 31 వరకు ఆన్లైన్ విచారణ కొనసాగనుంది. మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 16 వరకు మాత్రమే ఆన్ లైన్ విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. హైకోర్టులో ఈ నెల 31 వరకు ఆన్ లైన్ విచారణ విధానంలో కొనసాగుతుందని స్పష్టం చేసింది.