సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలో హైదరాబాద్ స్థానం విశిష్టమైంది. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం..విశ్వనగరంగా రూపాంతరం చెందింది. ఎన్నో అద్భుత కట్టడాలకు నెలవైన ‘హైదరాబాద్ షాన్’ ఈ తరానికి తెలిసేలా.. ఓ విద్యార్థి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హెరిటేజ్ వాక్ను నిర్వహిస్తూ.. నగర చరిత్రను అందరి మనసుల్లో పదిలం చేస్తున్నాడు.
స్నేహితులతో కలిసి..
గోల్కొండ సన్ సిటీకి చెందిన మహ్మద్ సిబ్గత్ ఖాన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలో అద్భుతమైన పురాతన సంపద ఉండి కూడా చాలా మందికి తెలియక పోవడం అతడిని కొంత ఆవేదనకు గురిచేసింది. దీంతో తన తోటి స్నేహితులు మని సాహిత్, మనీష్, వై.సురేందర్, వెంకట్ మోహన్, టోయాజ్, వందన జస్లార్, నాబిల్ సోఫియా, అయేషా మహ్మద్లతో కలిసి ఒక ఆలోచనను పంచుకున్నాడు. అలా ‘దక్కన్ ఆర్కైవ్’ను స్థాపించాడు.
ఏం చేస్తున్నారంటే..
సిబ్గత్ ఖాన్ ఓ వెబ్ సైట్తో పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దక్కన్ ఆర్కైవ్ పేరుతో ఆలోచనలను షేర్ చేసుకున్నాడు. గతేడాది అక్టోబర్లో మొదటగా నిజాం మ్యూజియం వద్ద వాక్ను నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. అలా కులీ కుతుబ్షాహీ టూంబ్స్, ఉస్మానియా యూనివర్సిటీ, గోల్కొండ కోట, సికింద్రాబాద్ చర్చి, పార్సి టెంపుల్, హుస్సేనీ ఆలం, సీతారాంబాగ్ దేవాలయం తదితర ప్రాంతాల వద్ద హెరిటేజ్ వాక్ను నిర్వహించారు. విద్యార్థుల బృందం ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా చేయడం లేదు. ఒక వాక్ను నిర్వహించే ముందు ఆ కట్టడం, ప్రదేశం సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉంటారు. వాక్ రోజు వచ్చిన వారందరికీ అక్కడి ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 20 చారిత్రక ప్రదేశాలపై వాక్ నిర్వహించారు. ఈ విద్యార్థుల బృందాన్ని బ్రిటిష్ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ సైతం అభినందించారు.
నేడు ‘జిందా తిలిస్మాత్’ వద్ద..
శనివారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జిందా తిలిస్మాత్ తయారీ కేంద్రం వద్ద హెరిటేజ్ వాక్ను ఏర్పాటు చేశారు. సుమారు 101 ఏండ్లుగా ప్రసిద్ధి చెందిన ఈ జిందా తిలిస్మాత్ తయారీ విశేషాలు, వాటి పరికరాలు వంటి అంశాలను ఈ వాక్లో వివరించనున్నారు.
హైదరాబాద్కు ఓ ప్రత్యేకత..
గొప్ప అందాలతో కూడిన కట్టడాలు, భవిష్యత్కు మార్గదర్శకం చూపే క్రమశిక్షణ, మతసామరస్యంతో కూడిన జీవనశైలి.. ఇలా అనేక అంశాల్లో మన హైదరాబాద్కు ఓ ప్రత్యేకత ఉంది. రోజు మనం నగరంలో తిరిగే వీధుల్లోనే చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.వాటి గురించి ఈ తరం వారికి తెలియదు. అందుకే హైదరాబాదీలందరికీ నగర చరిత్ర తెలియజేయాలనే ఆలోచనతో ఈ హెరిటేజ్ వాక్ను ప్రారంభించాం. భారీ స్పందన వచ్చింది. ప్రతి వాక్లో దాదాపు 50 మందికి పైగా పాల్గొంటున్నారు.
-మహ్మద్ సిబ్గత్ ఖాన్, దక్కన్ ఆర్కైవ్ వ్యవస్థాపకుడు