మాదాపూర్, నవంబర్ 28: మనిషి సహజ జీవనానికి దూరమై.. కృత్రిమ, యాంత్రిక జీవనానికి అలవాటు పడుతుండటంతో రోగకారకాలు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఆహారం, నీరు, గాలి అందకపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంతో అనేక రోగాలు, బ్యాక్టీరియా, వైరస్లు వ్యాప్తిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం హెచ్ఐసీసీలో యశోద హాస్పిటల్స్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ పల్మానాలజీ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ సమయంలో 50 వేలకుపైగా వైద్య సిబ్బంది సేవలు అందించడం గర్వకారణమని అన్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి కరోనా వైరస్ వరకు ఉపశమనం కలిగించే బ్రాకియల్ థర్మోప్లాస్టీ, ఇంటర్వెన్షనల్ బ్రాంకో స్కోపిక్ థర్మల్ వెపౌర్ ఆబ్లెషన్ లాంటి అత్యాధునిక వైద్యవిధానాలను దక్షిణాదిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత యశోద హాస్పిటల్ వైద్యులకు మాత్రమే దక్కిందని చెప్పారు.