హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని హైకోర్టు ప్రశంసించింది. రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసేందుకు నిరాకరించింది.
అయినా, కనీస మద్దతుధర చట్టంలో ఏముందో, ఏ చట్టం కింద ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలో చెప్పాలని పిటిషనర్ను ప్రశ్నించింది. చట్టాలు చేసేలా ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వలేవని, చట్టాలను అమలు చేయాలని మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని తేల్చిచెప్పింది. ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు లేదా వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
తెలంగాణవ్యాప్తంగా వడ్లను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారించింది. ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీస మద్దతు ధర రూ.1960 ప్రకటించినప్పటికీ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు రూ.వెయ్యికే అమ్ముకుంటున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వడ్లను కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలే దని, గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పా రు. ఇప్పటికే ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టిందని వివరించారు.