హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఏపీని వర్షాలు వదలట్లేదు. భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో పెన్నానది పోటెత్తుతున్నది. దీంతో కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద చెన్నై-కోల్కతా మార్గంలో జాతీయ రహదారి తెగిపోయింది. పడుగుపాడు వద్ద కూడా రోడ్డు కోతకు గురైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. కడప, పామూరు, దర్శి వైపు మళ్లిస్తున్నారు.
ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబయి జాతీయ రహదారిపై వరద ప్రవా హం తగ్గడంతో నెల్లూరు నుంచి కడప వైపు వాహనాలకు అనుమతిస్తున్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు కడప రైల్వేస్టేషన్లో నిలిపివేవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అనంత రం బస్సుల్లో ప్రయాణికులను తిరుపతికి పంపించారు. నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో నెల్లూరు-పడుగపాడు మార్గంలో 18 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను తాత్కాలికంగా రద్దుచేసి, 10 రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఒక రైలు వేళల్లో మార్పు చేసినట్టు పేర్కొన్నది.
భారీ వర్షాలతో తిరుపతి రామచ్రందాపురంలోని రాయల చెరువుకట్టకు స్వల్ప గండిపడింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయంతో ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. చెరువు తెగితే సుమారు వంద పల్లెలు నీట మునుగుతాయి. దీంతో పల్లెలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కలెక్టర్ హరినారాయణ్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు.