లక్నో, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో భారీగా పోలింగ్ నమోదైంది. 66.32 శాతం ఓటింగ్ రికార్డయింది. గతేడాది అక్టోబర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ పోనివ్వడంతో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతిచెందారు.
లఖింపూర్ ఘటనకు ప్రతీకారంగా బీజేపీకి ఓటుతో బుద్ధిచెబుతామని రైతులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో లఖింపూర్లో భారీగా పోలింగ్ నమోదుకావడం గమనార్హం. నాలుగో విడుతలో భాగంగా బుధవారం 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. రాత్రి 11.30 గంటల సమయానికి అందిన సమాచారం మేరకు 61.50 ఓటింగ్ శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 624 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. లక్నో, ఉన్నావో, హర్దోయి, సీతాపూర్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చేసుచేసుకున్నాయని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, డిప్యూటీ సీఎం దినేశ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
భారీ భద్రత నడుమ అజయ్ మిశ్రా ఓటు
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం భారీ భద్రత నడుమ బన్వారిపూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటేసేందుకు వెళ్లేటప్పడు కానీ, పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేటప్పడు గానీ ఆయన మీడియాతో మాట్లాడలేదు.