కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో రెండేండ్లుగా ప్రతి ఒక్కరిలోనూ శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడి కనిపిస్తున్నది. అలా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఈ సమస్యలకు కూచిపూడి నృత్యం ఒక పరిష్కారమని అంటున్నారు హైదరాబాద్కు చెందిన నృత్యకారిణి డాక్టర్ సురభి లక్ష్మీ శారద. ‘సురభి అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ’ ద్వారా పదేండ్లుగా లక్ష్మీ శారద తన విద్యార్థులతో ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు.
కూచిపూడి, భరతనాట్యం అనగానే అవేవో కష్టమైన నృత్యాలనే అభిప్రాయం స్థిర పడిపోయింది. దీంతో శాస్త్రీయ నృత్యాలపట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రమే నేర్చుకుంటున్నారు. ‘నిజానికి నృత్యాల్లో వేసే అడుగులు శరీరంలోని క్యాలరీలను కరిగిస్తాయి. ఏకాగ్రత స్థాయులను పెంచుతాయి. మానసిక ఉపశమనాన్ని ఇస్తాయి. ఒత్తిడిని తట్టుకునేలా చేస్తాయి’ అంటారు లక్ష్మీ శారద. 30 ఏండ్ల లోపువారికి ఊబకాయం ఓ పెద్ద సమస్య. అలాంటివారి కోసం ఆమె కొన్ని నృత్య భంగిమలు రూపొందించారు. నేర్చుకునేవారి వయసు, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, భావోద్వేగపరమైన ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయులను బట్టి లక్ష్మీశారద తన విద్యార్థులకు సిఫారసు చేసే విధానాలు మారిపోతూ ఉంటాయి.
‘నృత్యం చేస్తున్నప్పుడు దృష్టి అంతా చేతులు, కాళ్ల కదలికలపైనే ఉంటుంది. లయ బద్ధంగా అడుగులు వేస్తుండటం వల్ల రోజువారీ సమస్యలను మరిచిపోగలుగుతాం. ఇతర వ్యాయామాల్లాగే నృత్యంలో కూడా ఆనంద హార్మోన్లు విడుదల అవుతాయి’ అని చెబుతారు లక్ష్మీ శారద. పతంజలి యోగాకు సంప్రదాయ నృత్య భంగిమలే ఆధారమని ఆమె ప్రగాఢ విశ్వాసం.