AP Minister : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయిన వ్యక్తి అని అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని విజయసాయి రెడ్డి చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తిని ప్రజలు మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. ఆయన తన సొంత పార్టీ నుంచే గెంటివేయబడ్డారని, అలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చెప్పారు. అటు దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
తానే స్వయంగా అందరితో మాట్లాడానని, కూటమి ప్రభుత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉందని మంత్రి స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.