ఉమ్మడి మెదక్ డెస్క్, డిసెంబర్ 4: తల్లిదండ్రుల ఆవేశానికి, కోపానికి పలువురు చిన్నారులు బలవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలపై ఆవేశం వెల్లగక్కుతున్నారు. ఇంట్లో మొదలయ్యే తల్లిదండ్రుల గొడవలకు ఆ చిన్నారులు కారకులు కారు కదా. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియక దిగాలుగా చూస్తూ ఉంటారు ఆ చిన్నారులు. ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకముందే ఆ పసి మొగ్గల ప్రాణాలు నేల రాలుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కారణం ఏదైనా పసిపిల్లలను కాటికి పంపించేందుకు కారకులు అవుతున్నారు తల్లిదండ్రులు. మానసిక ఒత్తిళ్లతో క్షణికావేశంలో పిల్లలతో సహా ఆత్మహత్యలకు ఒడిగట్టడం ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కుటుంబంలో గొడవలతో చిన్నారులను పసిప్రాయంలోనే చిధిమేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఆర్థిక స్థితిగతుల చుట్టూ తిరుగుతూ సహనాన్ని కోల్పోతున్నాడు. సహనంతోపాటు వారి ఆలోచనా విధానాలు మారితేనే మార్పువస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
పసిప్రాయంలో నేల రాలుతున్నారు..
ఇటీవల కాలంలో మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఓ చోటు చేసుకున్న ఘటనలో తండ్రి చేతిలో కూతురు హతమైంది. కుటుంబ సభ్యులు కుదిర్చి పెళ్లి చేయగా, వారికి పిల్లలు పుట్టక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. ఆ తర్వాత ఆమె మళ్లీ పెళ్లిచేసుకుని ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అనంతరం గతంలో పెళ్లి చేసుకున్న వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకున్నది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా, ఇద్దరూ కలిసి దవాఖానకు వెళ్లి వస్తూ మొదటి భర్త చిన్నారిని తనవద్దే ఉంచుకుని భార్యను ఆటోలో ఇంటికి పంపించాడు. చిన్నారిని తీసుకుని వస్తుండగా ఆమె తన కూతురు కాదని వేరే అతడికి పుట్టిందని, ఆ చిన్నారి గొంతు నులిమి చంపేశాడు ఆ పాపాత్ముడు. ఇందులో ఆ చిన్నారి చేసిన తప్పు ఏమిటి? తల్లిదండ్రులు చేసిన పొరపాటుకు ఆ
చిన్నారి ప్రాణం తీయడం న్యాయమేనా..?
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో శుక్రవారం ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ మహానగరంలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఆ చిన్నారుల తండ్రి గృహనిర్మాణాన్ని తలపెట్టాడు. వచ్చిన జీతం మొత్తం నిర్మాణానికే వెళ్తుండగా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండడంతో గొడవలు మొదలయ్యాయి. ఇక్కడ గొడవ భార్యాభర్తల మధ్య కాకపోయినా ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడగా, ఆయన లేని జీవితం తనకు వద్దనుకుని తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి అందోల్ సమీపంలోని ఓ చెరువులో దూసి ఆత్మహత్య చేసుకున్నది.
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న అనుమానం ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని అతి కిరాతంగా హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. శుక్రవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లొస్తామని కుమార్తెను తీసుకొనివెళ్లాడు. పొలానికి పాప ఎందుకని భార్య వారించినా వినకుండా తీసుకెళ్లాడు. తన పొలం వద్ద చిన్నారి కాలికి విద్యుత్ వైర్లు చుట్టి స్టార్టర్ ఆన్చేయడంతో కరెంట్ సరఫరా అయ్యి కూతురు అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం పురుగుల మందు తాగి, తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలో చిన్నారికి కరెంట్ షాక్ తగిలించి తన కర్కశత్వాన్ని చూపించాడు. లోకం తెలియని ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది ఆ చిన్నారిని కన్న తండ్రే. క్షణికావేశంలో ఇలాంటి దారుణాలకు పాల్పడడంతో సమాజం పోకడలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
మార్పు రావాలి..
తల్లిదండ్రులు ఎంత కష్టపడినా అది వారు కడుపున కన్నవారి కోసమే. అలాంటిది వారు కనుకున్న వారిని చంపుకోవడానికి కారణాలు కేవలం క్షణికావేశం మాత్రమేనని తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. కాస్త సహనంతో ఆలోచించి చూస్తే ఎంతటి సమస్యనైనా ఛేదించవచ్చు. అది మానేసి ఒకరిపై ఒకరు ఆరుచుకుంటూ పిల్లలపై కోపాన్ని చూపిస్తూ ఉంటే వారి మనసుపై చెరగని గాయంలా మిగిలిపోతుంది. కొంతమంది అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వారిని పసిప్రాయంలోనే ఉసురు తీస్తున్నారు. పిల్లలను కన్నది అందుకోసం కాదుకదా? తల్లిదండ్రులూ ఒక్కసారి ఆలోచించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకోవచ్చు. ప్రాణాలు తీసుకుంటే ఏం వస్తుంది.
ఆలోచనా విధానం మారాలి..
ప్రస్తుతం మనిషి డబ్బు వెనుక పడుతూ తన విలువైన జీవితాన్ని మొత్తం దానికే కేటాయిస్తున్నాడు. మనుషుల ఆలోచనా విధానం మారాలి. డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, మన కుటుంబ బాంధవ్యాలకూ విలువనివ్వాలి. ముఖ్యంగా ఇంట్లో పిల్లల ముందు ఎలాంటి గొడవలు పడకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు మెలిగే తీరు పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతుంది. గొడవలకు కారణం ఏదైనా కావచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ, తమ ప్రాణాలతో పాటు పిల్లల ప్రాణాలు తీసుకోకూడదు.