కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్-2021’ నివేదిక ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం అడవులను విస్తరించడంలో (3.07 శాతంతో) దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలంగాణలో 2019లో 20,582 చ.కి.మీ. అటవీ ప్రాంతం ఉంటే, 2021 వార్షిక నివేదిక సమయానికి 21.214 చ.కి.మీ.కు అటవీ ప్రాంతం పెరిగింది.
తివృష్టి, అనావృష్టి ఇతర ప్రకృతి విలయాలు రాకుండా అడవులను కాపాడుకోవాలనే మహోన్నతమైన ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. అడవుల పెంపకం, పచ్చదనాన్ని కాపాడటంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి ప్రభుత్వ కార్యదీక్షను తెలియజేస్తున్నది. దేశవ్యాప్తంగా అడవుల్లో పెరుగుదల, తగ్గుదల ఎలా ఉన్నదనే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ వివిధ కోణాల్లో సర్వే నిర్వహించింది. తద్వారా రాష్ర్టాల పరిస్థితిని బేరీజు వేసింది. ఈ నేపథ్యంలో 10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మహా నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2011లో 33.15 చ.కి.మీ. ఉన్న హైదరాబాద్ నగర అటవీ ప్రాంతం ఈ పదేండ్లలో 81.81 చ.కి.మీ. విస్తరించి 149 శాతం వృద్ధి సాధించింది.
దేశంలోని ఇతర నగరాల విషయానికి వస్తే… బెంగళూరులో 94 చ.కి.మీ. ఉన్న అటవీ ప్రాంతం 89.2 చ.కి.మీ. తగ్గి, 5 శాతం అటవీ ప్రాంతం కోల్పోయింది. 17.96 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న అహ్మదాబాద్ నగరంలో 9.41 చ.కి.మీ. తగ్గి, 48 శాతం అటవీ ప్రాంతం కనుమరుగైంది. 2.52 చ.కి.మీ. అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న కోల్కతాలో 1.77 చ.కి.మీ. తగ్గి, 30 శాతానికి పడిపోయింది. తీవ్ర వాయు కాలుష్యంతో అతలాకుతలమవుతున్న ఢిల్లీ నగరం 174.33 చ.కి.మీ. అటవీ ప్రాంతాన్ని 194.24 చ.కి.మీ.కు పెంచి 11 శాతం వృద్ధిరేటును సాధించింది. రెండేండ్లలోనే తెలంగాణ రాష్ట్రంలో 632 చ.కి.మీ.ల మేర అడవుల పెంపకం జరిగిందంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విజయంలో గొప్ప సంకల్పం దాగి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ ఊరూరా, వాడవాడనా చెట్లు పెరగడానికి దోహదం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 149 శాతం మేరకు అటవీ ప్రాంతం విస్తరించిందంటే సాధారణ విజయం కాదు. గొప్ప దూరదృష్టి, లోతైన అధ్యయనం, చిత్తశుద్ధి తోడైతేనే ఇది సాధ్యమవుతుందనే విషయం పర్యావరణ ప్రేమికులకు సులువుగా అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను పెంచడంలో ప్రజలను జాగృతం చేసింది. ‘హరితహారం’ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి అడవులను పెంచడంలో పురోభివృద్ధిని సాధించింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్రంలోని పలు నగరాల్లోని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు విద్యార్థులు కేసీఆర్ బాటలో నడిచారు. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లాల ప్రధాన రోడ్లతో సహా అన్ని గ్రామాల్లో, పల్లెల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించుకున్నారు. దీనివల్ల వందల ఎకరాల అటవీ విస్తీర్ణానికి పునాది పడింది. కొత్తగా అనేక పార్కుల ఏర్పాటు రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషి గత ప్రభుత్వాలకు భిన్నమైనది. వివిధ జాతుల మొక్కలు 365 రోజుల పాటు అన్ని కాలాల్లో పూసే పూల చెట్లను చూస్తే ఒళ్లు పులకించిపోయేలా రాష్ట్రం రూపుదిద్దుకున్నదనే మాట వాస్తవం.
పర్యావరణ పరిరక్షణకు ఉద్యమస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలి. ఊహకందని అద్భుతం, దృశ్యాలు కళ్లముందు కనిపించేలా, పచ్చదనాన్ని ద్విగుణీకృతం చేసే గొప్ప బాధ్యతను మనందరం బాధ్యతగా తీసుకోవాలి. చెట్లు, మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని ప్రచారం చేస్తూ ప్రజలకు స్ఫూర్తినింపిన పద్మశ్రీ వనజీవి రామయ్య మాదిరిగా భవిష్యత్తరాల ప్రజల ఆయురారోగ్యాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ర్టాన్ని పచ్చదనంతో కప్పేయాలి.
‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ లాంటి అనేక పథకాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో పచ్చగా కళకళలాడటానికి, అటవీ ప్రాంతాల విస్తరణకు ఈ పథకాలూ కారణమయ్యాయనడంలో సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు, ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే అటవీ ప్రాంత విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది.
ఇక మన ముందున్న లక్ష్యం హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చడమే. ప్రతి పౌరుడు యుద్ధ ప్రాతిపదికన శ్రమిస్తే ఇందులోనూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. దీనికోసం పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల కోసం గొప్ప సంకల్పంతో ముందుకుసాగాలి. పర్యావరణ పరిరక్షణలో చిత్తశుద్ధి ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయడం నల్లేరు మీద నడకే అన్న విషయం ప్రతి పౌరుడు గ్రహించాలి.
వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించడానికి, నిర్దిష్ట కాలవ్యవధిలో రైతుల ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్రం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. దేశం నైసర్గికంగా, వనరులు, వాతావరణపరంగా పలు వ్యవసాయ జోన్లుగా విడిపోయినందు వల్ల ఎక్కడికక్కడే ప్రాధాన్యాలు, వనరుల ఆధారంగా రాష్ర్టాలతో సంప్రదించి సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడం అవసరం.
(వ్యాసకర్త: ఎల్బీనగర్ ఎమ్మెల్యే, మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్)
-దేవిరెడ్డి సుధీర్ రెడ్డి