హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం లీగల్ నోటీసులు పంపారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో దేవాలయాలకు వెళ్లి క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ తనపై ఇద్దరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల్లో తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మొక్కులు తీర్చుకొనేందుకు గుడికి వెళ్లడం మన సంప్రదాయమని, అలా భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్తే ఆ విషయాన్ని సైతం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు.
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షగట్టి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వార్తా చానళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో అవే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. సోషల్ మీడియా, వెబ్సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్, ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ తప్పుడు వీడియోల పోస్టులను తొలగించాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.