అనారోగ్యంతో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం
ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో పెను విప్లవానికి నాందిపలికిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్ను మూసారు. 83 సంవత్సరాల వయస్సుగల బజాజ్ వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. పుణెలోని ఆయన స్వగృహంలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మృతిచెందినట్లు బజాజ్ గ్రూప్ అధికారి ఒకరు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ 30న బజాజ్ ఆటో చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వైదొలిగిన రాహుల్ బజాజ్ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు. రాహుల్కు ఇద్దరు కుమారులు రాజీవ్ బజాజ్, సంజీవ్ బజాజ్, కుమార్తె సునయినాలు ఉన్నారు. 1938 జూన్ 10న కోల్కతాలో జన్మించిన రాహుల్.. అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తిచేశారు.
అవార్డులు..డాక్టరేట్లు
2008లో బజాజ్ ఆటోను మూడు భాగాలుగా బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్లుగా విభజించారు. 2006 నుంచి 2010 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాహుల్ను పద్మభూషణ్తో పాటు పలు అవార్డులు, వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు వరించాయి.
ప్రభుత్వాలపై వ్యతిరేక గళం
ప్రభుత్వాలతో సామరస్యంగా వ్యవహరించే పారిశ్రామికవేత్తలకు రాహుల్ బజాజ్ పూర్తిగా భిన్నం. పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాల్ని బహిరంగంగా ఎండగట్టేవారు. హోంమంత్రి అమిత్షాతో సహా నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్ తదితర కేంద్ర మంత్రులు పాల్గొన్న 2019లో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో బజాజ్ నేరుగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. పాల్ఘర్లో ఇద్దరు సాధువులు.. అల్లరి మూకల దాడిలో మృతిచెందిన సంఘటన సందర్భంగా విమర్శకుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పలు ప్రశ్నల్ని మంత్రులకు సంధించారు.
మధ్యతరగతికి చేరువైన చేతక్
1965లో కుటుంబ వ్యాపారమైన బజాజ్ గ్రూప్ వ్యాపార పగ్గాలు చేపట్టి బజాజ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేశారు. ఆయన తాత జమ్నాలాల్ బజాజ్ 1926లో బజాజ్ గ్రూప్ను నెలకొల్పారు. తండ్రి కమల్నయన్ బజాజ్ బృందంలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేరిన రాహుల్.. 30 ఏండ్ల వయస్సులో కంపెనీ సీఈవో అయ్యారు. మధ్యతరగతి ప్రజలకు బజాజ్ చేతక్ స్కూటర్ 1980, 1990 దశకాల్లో ఒక ఆశావహ చిహ్నంగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ నేతృత్వంలో స్కూటర్ల కోసం రూపుదిద్దుకున్న ‘హమారా బజాజ్’ పాటపల్లవి బహుళప్రాచుర్యం పొంది, బజాజ్ గ్రూప్ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసింది. జపాన్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థల నుంచి బజాజ్ ఆటో స్కూటర్లకు ఎదురైన సవాళ్లను విజయవంతంగా తట్టకుని, వాటికి ధీటుగా బజాజ్ బైక్స్ను ఆవిష్కరించి విదేశీ కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చిన సత్తా రాహుల్ బజాజ్ది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ బజాజ్ ఆటో టర్నోవర్ను రూ. 7.2 కోట్ల నుంచి రూ. 12,000 కోట్లకు రాహుల్ పెంచారు.
ప్రముఖుల సంతాపాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి, దేశ వ్యాపార వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కృషి గొప్పదన్నారు. ఆయన వల్లనే బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజాజీవనంలో భాగస్వామ్యం అయ్యాయన్నారు. ‘హమారా బజాజ్’ అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తి రంగంలో స్వీయ అస్తిత్వ విధానం దిశగా చైతన్య పరిచిందని సీఎం అన్నారు. రాహుల్ బజాజ్ సామాజిక బాధ్యత కలిగిన జాతీయవాద వ్యాపారవేత్తగా సీఎం పేర్కొన్నారు. రాహుల్ బజాజ్ మరణం దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఆయన తయారుచేశారు.
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
భారత పరిశ్రమ ఒక మహోన్నత శిఖరాన్ని కోల్పోయింది. వాణిజ్య వ్యవస్థలో బజాజ్ లేని లోటు తీర్చలేనిది.
-టీవీ నరేంద్రన్, సీఐఐ ప్రెసిడెంట్
దేశ కార్పొరేట్ రంగానికున్న అంతర్గత బలాన్ని బజాజ్ వృత్తి జీవితం ప్రతిబింబిస్తున్నది.
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
పారిశ్రామిక, వాణిజ్య ప్రపంచానికి రాహుల్ బజాజ్జీ చేసిన మేలు గుర్తుండిపోతుంది.
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాహుల్ బజాజ్ మృతికి ఆటోమొబైల్ పరిశ్రమ అంతా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆటో పరిశ్రమకు ఆయన చేసిన సేవలు విలువకట్టలేనివి.
-కెనిచి అయుకవా, సియామ్ ప్రెసిడెంట్
థాంక్యూ రాహుల్భాయ్, నాకు సలహాలిచ్చినందుకు, ఉత్సాహపర్చినందుకు, ప్రోత్సహించినందుకు. భారత వ్యాపార సామ్రాజ్యపు ఇసుకలో మీ పాదముద్రలు ఎప్పటికీ చెరగవు
– ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్
నిర్భయుడు, నిజాన్ని మాట్లాడే అరుదైన వాణిజ్యవేత్త. సగర్వ భారతీయుడు. ప్రపంచస్థాయి సంస్థను నిర్మించినవాడు. రాహుల్ను మిస్ అవుతున్నా
-ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో
‘దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటు. ఐఎస్బీ సంస్థ గొప్ప శ్రేయోభిలాషిని కోల్పోయింది’
– హరీశ్ మన్వానీ, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్