పోర్ట్-ఓ-ప్రిన్స్ : కరేబియన్ ద్వీప దేశం హైతీలో భూకంపం తీరని విషాదాన్ని నింపింది. భారీ ప్రకంపనల ధాటికి చాలా భవనాలు కుప్పకూలడంతో ఇప్పటి వరకు 1,419 మంది వరకు చనిపోయారు. ఆరువేల మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం ధాటికి నైరుతి హైతీలో ఆసుపత్రితో పాటు పెద్ద ఎత్తున ఇండ్లు, వాణిజ్య భవనాలు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే గాయాలకు గురైన వారితో ఆసుప్రతులు నిండిపోయారు. ఇండ్లు నేలమట్టమవడంతో జనం డాబాలు, కారిడార్లు, పలువురి ఇంటి వరండాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు విమానాశ్రయం టార్మాక్లో ఆశ్రయం పొందుతున్నారు. పశ్చిమ అర్ధగోళంలో అత్యంత పేద దేశాల్లో హైతీ ఒకటి. ఇప్పటికే కరోనా మహమ్మారి, హింస, పేదరికం, రాజకీయ అశ్చితితో హైతీ అల్లాడుతోంది.