యవ్వనపు ఉత్తేజంతో ఊరేగిన రోజులు, కాలేజీ రోజుల్లోని తొలిప్రేమ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మదిలో పదిలంగా ఉంటాయి. హృదయంలో నిక్షిప్తమై ఉన్న ఆ ఆనుభవాలను తరచిచూసుకుంటే ఓ నాస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి అందమైన జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చే ప్రయత్నమే ‘గుర్తుందా శీతాకాలం’ అన్నారు నాగశేఖర్. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా, కావ్యశెట్టి, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ప్రేమికులరోజు కానుకగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మనసును తడిమే ప్రణయభావనలకు దృశ్యరూపంగా ఈ సినిమా అలరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాతలు: భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: నాగశేఖర్.