170 పరుగుల లక్ష్యఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 122/5తో నిలిచింది. డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నా.. అవతలి ఎండ్లో అతడికి సహకరించే వారే కరువయ్యారు! చెన్నై బౌలర్లు జోరుమీదుండగా.. విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు అవసరమైన దశలో స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాట్తో సునామీ సృష్టించాడు. జోర్డాన్ ఓవర్లో మూడు సిక్సర్లు ఓ ఫోర్ అరుసుకోవడంతో టార్గెట్ 12 బంతుల్లో 23కు చేరగా.. మిగిలిన పని మిల్లర్ పూర్తిచేశాడు!
పుణే: చాన్నాళ్ల తర్వాత డేవిడ్ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) స్థాయికి తగ్గ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఐపీఎల్-15వ సీజన్లో గుజరాత్ ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తాజా సీజన్లో టచ్ దొరక్క ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 73; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో మెరువగా.. అంబటి రాయుడు (46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 56 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు.
గుజరాత్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ అజేయ ఇన్నింగ్స్తో అదరగొడితే.. స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్తో తన ప్రతాపం చూపాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో పగ్గాలు అందుకున్న రషీద్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. బంతితో (0/29)పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రషీద్ బ్యాట్తో చెన్నైని చెడుగుడాడుకున్నాడు.
ఎడాపెడా బౌండ్రీలతో బెంబేలెత్తించాడు. జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో రషీద్ 25 పరుగులు రాబట్టడంతోనే మ్యాచ్ గుజరాత్ వైపు మొగ్గింది. నాలుగు మ్యాచ్ల తర్వాత గెలుపు రుచి చూసిన చెన్నైకి ఆ వెంటనే పరాజయం పలకరించింది. చెన్నై బౌలర్లలో బ్రేవో 3, మహేశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. మిల్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం రాజస్థాన్తో కోల్కతా తలపడనుంది.
చెన్నై: 20 ఓవర్లలో 169/5 (గైక్వాడ్ 73, రాయుడు 46; అల్జారీ 2/34), గుజరాత్: 19.5 ఓవర్లలో 170/7 (మిల్లర్ 94*, రషీద్ ఖాన్ 40; బ్రేవో 3/23, మహేశ్ 2/24).