బెంగళూరు: ఒంటరి పోరాటానికి సమిష్టితత్వానికి మధ్య జరిగిన పోరులో ఐకమత్యానిదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34-27తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. గుజరాత్ సమిష్టిగా సత్తాచాటితే.. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ తరఫున గిరీశ్ మారుతి 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించగా.. రాకేశ్ నర్వాల్ (7 పాయింట్లు) రైడింగ్లో రాణించాడు. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా.. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి గుజరాత్ 19-17తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో జోరు పెంచిన గుజరాత్ వరుస పాయింట్లతో విజృంభిస్తే అనవసర తప్పిదాలతో జైపూర్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ కెప్టెన్ దీపక్ హుడా (4 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా.. అర్జున్ దేశ్వాల్ సూపర్-10 సాధించాడు. అయినా కీలక సమయంలో వెనుకబడి పోయిన జైపూర్కు నిరాశ తప్పలేదు. ఇక ఇతర మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీ 41-30 తేడాతో పుణెరీ పల్టన్పై.. పట్నా పైరెట్స్ 42-39తో హర్యానా స్టీలర్స్పై విజయాలు సాధించాయి. కరోనా కారణంగా బయోసెక్యూర్ వాతావరణంలో జరుగుతున్న మెగా లీగ్లో శుక్రవారం యూ ముంబాతో దబంగ్ ఢిల్లీ.. తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్.. బెంగాల్ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.
హోరాహోరీ..
చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్లో హర్యానాపై పట్నా గెలుపొందింది. పట్నా తరఫున రోహిత్ 10 పాయింట్లు సాధించగా.. కెప్టెన్ వికాస్ ఖండాలా 6 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున మోను గోయత్ 15 పాయింట్లతో వీరవిహారం చేయగా.. కెప్టెన్ ప్రశాంత్ కుమార్, సచిన్ చెరో 7 పాయింట్లు సాధించారు. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనేంత వరకు పూర్తి ఆధిక్యంలో ఉన్న పట్నా.. ఆఖర్లో ఒత్తిడికి గురై ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమిచ్చింది. అయినా మోను గోయత్ వన్మ్యాన్ షోతో మ్యాచ్ను పట్నా వైపు తిప్పాడు.
నవీన్ దూకుడు..
పుణెరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ విశ్వరూపం ప్రదర్శించాడు. 16 పాయింట్లతో విజృంభించి ఈ సీజన్లో ఢిల్లీకి తొలి విజయాన్నందించాడు. అతడికి విజయ్ (9 పాయింట్లు) నుంచి చక్కటి సహకారం లభించగా.. అజయ్ ఠాకూర్, జోగిందర్ నర్వాల్, సందీప్ నర్వాల్ ట్యాకింగ్లో సత్తాచాటారు. పుణెరి తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) పేలవ ప్రదర్శన చేయగా.. కెప్టెన్ నితిన్ తోమర్ (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. సబ్స్టిట్యూట్గా జట్టులోకి వచ్చిన అస్లమ్ (5 పాయింట్లు) కాస్త పోరాడాడు.
పీకేఎల్లో నేడు
యూ ముంబా x దబంగ్ ఢిల్లీ
తమిళ్ తలైవాస్ x బెంగళూరు బుల్స్
బెంగాల్ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్