హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు మామిల్ల రాజేందర్, రాజయకంటి ప్రతాప్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కోరారు. ఈ మేరకు గురువారం సీఎస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ అమలు కోసం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి, చైర్మన్ను నియమించాలని, ఉద్యోగులకు పలు మినహాయింపుల కోసం రాష్ట్రస్థాయిలో గతంలో మాదిరిగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో శాఖాధిపతులు జాప్యం చేస్తున్నందున.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు రాజేందర్ తెలిపారు. సీఎస్ను కలిసిన వారిలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాస రావు, నల్లగొండ టీఎన్జీవో అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం నేతలు తదితరులు ఉన్నారు.