హైదరాబాద్, జూలై 31: ఫినిష్డ్ స్టోన్ గ్రానైట్, లగ్జరీ క్వార్జ్ సర్ఫేసెస్ (ఆర్టిఫిషియల్ గ్రానైట్)లో ప్రస్తుతం పరిశ్రమలో ప్రసిద్ధిచెందిన పేరు పొకర్ణ గ్రూప్. మూడు దశాబ్దాల క్రితమే గ్రానైట్ వ్యాపారంలో ప్రవేశించిన పొకర్ణ లిమిటెడ్ అత్యాధునిక ఉత్పాదక పద్దతులు అనుసరించడం ద్వారా ఫినిష్డ్ గ్రానైట్ స్టోన్ ఎగుమతుల్లో ఇప్పుడు ఇండియాలో టాప్ కంపెనీ ఇది. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం, యూరప్ల్లోని దాదాపు 12 దేశాలకు ఎగుమతులు జరిపే పొకర్ణ…ఆసియాలోనే అతిపెద్ద గ్రానైట్ కంపెనీల్లో ఒకటిగా రూపొందింది. టెక్స్టైల్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ద్వారా ప్రస్థానాన్ని ఆరంభించిన గౌతమ్చంద్ జైన్ ఒక గ్రానైట్ క్వారీని కొని, 1991లో పోకర్ణ లిమిటెడ్ నెలకొల్పారు. క్రమేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని పలు జిల్లాల్లో పొకర్ణ గ్రానైట్ క్వారీల్ని, ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఫ్యాషన్ బిజినెస్లో పట్టున్న జైన్ 75 రకాల గ్రానైట్ స్టోన్స్ను సమీకరించి, వాటికి ఫ్యాషన్ను జతచేసి, వివిధ రంగుల్లో, ఆకట్టుకునే ఫినిష్డ్ గ్రానైట్ స్టోన్తో ఎగుమతుల మార్కెట్లో విజయం సాధించారు. పశ్చిమదేశాల్లో క్వార్జ్ సర్ఫేసెస్కు పెరుగుతున్న ఆదరణను గమనించిన జైన్…ఇటలీ కంపెనీ, బ్రెటాన్తో జతకలిసి 2009లో సబ్సిడరీగా పొకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ను నెలకొల్పారు.
ఏపీలో అచ్యుతాపురం ఏపీసెజ్లో తొలిప్లాంటును ఏర్పాటుచేసి క్వార్జ్ సర్ఫేసెస్ ఎగుమతులకు శ్రీకారం చుట్టిన పొకర్ణ తాజాగా హైదరాబాద్ సమీపంలో రూ.500 కోట్ల పెట్టుబడులతో మరో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లగ్జరీ క్వార్జ్ సర్ఫేసెస్ ప్లాంటును నెలకొల్పింది. క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్నేమ్తో ఈ శ్లాబుల్ని వివిధ దేశాల్లో పొకర్ణ విక్రయిస్తుంది. స్టోన్ గ్రానైట్లలానే క్వార్జ్ సర్ఫేస్ల్ని కూడా డిజైనర్లు వినూత్నంగా మలుచుకొవొచ్చు. ఇదేతరహాలో మరో ప్లాంటు ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది కూడా. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన పొకర్ణ లిమిటెడ్ రూ.300-400 వార్షిక టర్నోవర్ను నమోదుచేస్తుండగా, శనివారం ప్రారంభమైన కొత్త ప్లాంటులోని ప్రీమియం ఉత్పత్తుల ద్వారా మరో రూ.400 కోట్ల టర్నోవర్ను పొకర్ణ యాజమాన్యం అంచనా వేస్తున్నది.