న్యూఢిల్లీ : సంపూర్ణ వికాసానికి పోషకాహారం అడ్డంకిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కరూ కూడా పోషకాహార లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం వంటి వివిధ పథకాల ద్వారా పేదలకు పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం పటిష్టం చేస్తుందన్నారు. పోషకాహార లోపం, సూక్ష్మ పోషకాల లోపం నిరుపేద పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయని, దీన్ని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఇచ్చే పోషకాహారాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రేషన్ షాపులు లేదంటే మధ్యాహ్న భోజన పథకం ద్వారా అయినా, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం కింద అయినా అందుబాటులో ఉన్న బియ్యం 2024 నాటికి పటిష్టం చేస్తామని చెప్పారు. పోషకాహారంతో పాటు వైద్యం అత్యంత కీలకమైందన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. వైద్యుల సంఖ్య పెంచేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. ఓబీసీల్లో ఎవరు ఉండాలనేదానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా చూడాలన్నారు. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఆహారధాన్యాల సమృద్ధి సాధించినా.. నూనెగింజల కొరత వేధిస్తోందన్నారు. 25 ఏళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధి సాధించాలన్నారు.
జమ్మూకాశ్మీర్ నూతన అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. లద్దాఖ్ అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయన్నారు. లద్దాఖ్ ప్రజల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి అందరినీ కలుపుకొని ఉండాలని, ఈశాన్య ప్రాంతం, జమ్మూ కాశ్మీర్, లడఖ్, తీరప్రాంతం.. గిరిజన ప్రాంతాలతో సహా హిమాలయ ప్రాంతం భవిష్యత్లో భారతదేశ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు.
పరస్పర సహకారంతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ప్రధాని చెప్పారు. సహకారం అనేది ఒక స్ఫూర్తి అని, ఒక సంస్కృతి అన్నారు. ఈ సంస్కృతి, స్ఫూర్తిని మరింత ప్రస్పుటం చేసేందుకు కొత్త శాఖ ఏర్పాటు చేశామన్నారు. వచ్చే పదేళ్లలో గ్రామాల్లో నూతన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి సంకల్పించాలన్నారు. ప్రతి గ్రామాన్ని ఆఫ్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయాలని, గ్రామీణ, స్వయం సహాయ ఉత్పత్తుల డిజిటల్ మార్కెట్లోకి రావాలన్నారు. మన ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద మార్కెట్ ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్నామన్నారు. డిజిటల్ విప్లవంతో మన ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు.
వ్యవసాయ రంగంలో ఇంకా నూతన సంస్కరణలు అవసరమన్నారు. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోందన్నారు. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల్లోపు భూమి కలిగిన వారేనని, కుటుంబాల నిరంతర విఘటనతో భూకమతాల పరిమాణం తగ్గుతోందన్నారు. చిన్న రైతులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ పథకాలను మార్చుకోవాలన్నారు. కిసాన్ బీమా, ఫసల్ బీమా, రైతులకు సమర్థంగా అందేలా చూడాలన్నారు. చిన్న, సన్నకారు రైతులు దేశానికే గర్వకారణమని నిరూపించగలిగారని.. చిన్న, సన్నకారు రైతులు దేశానికే గర్వకారణమయ్యేలా పథకాలుండాలన్నారు. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలని, భారత ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.