అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజైనా పోలవరంపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలన్నారు. అసెంబ్లీకి వస్తే మీరు, మేం చేస్తున్న సవాళ్లపై చర్చిద్దామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో కూడా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దామని చెప్పారు. అసెంబ్లీకి రానని శపథం చేసిన చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చినందున పోలవరంపై చర్చకు కూడా రావాలని అంబటి ఆహ్వానించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ఉన్నది ఉన్నట్లుగానే చెప్తామని, అబద్ధాలు చెప్పాల్సిన పని తమ ప్రభుత్వానికి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తప్పిదాలే పోలవరం ప్రాజెక్టుకు శాపాలుగా మారాయని ఆరోపించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణమన్నారు. అప్పటి చంద్రబాబు సర్కార్ నిర్ణయం కారణంగానే వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని బీరాలు పలికి చేతులెత్తేశారని, మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దీంతో తేలిందని దుయ్యబట్టారు.
అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికేనని మంత్రి అంబటి అన్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్న పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. రెండు చేతులా సంపాదించుకోవడానికే ఈ పాదయాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్కామ్కు బీజం వేసింది కూడా చంద్రబాబే అని పేర్కొన్నారు. రైతుల పాదయాత్ర అని చెప్తున్న ఈ పాదయాత్రలో ఒక్క రైతు కూడా లేరని చెప్పారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం విధానమని తెలిపారు.