న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రధాన కార్యదర్శి పదవికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ పోటీకి సిద్ధమయ్యాడు. ఈనెల 25న జరుగనున్న బాయ్ ఎన్నికల కోసం గోపీచంద్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ‘ప్రధాన కార్యదర్శి పదవికి గోపీచంద్ గురువారం నామినేషన్ వేసే అవకాశం ఉంది’ అని బాయ్ వర్గాలు తెలిపాయి. నామినేషన్లకు శుక్రవారం ఆఖరు రోజు కావడంతో గోపీ పోటీలో నిలిచే అవకాశాలున్నాయి. సైనా, సింధు లాంటి అత్యుత్తమ షట్లర్లను అందించిన 48 ఏండ్ల గోపీచంద్.. ఎన్నికల్లో పోటీతో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు.