హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎండల తీవ్రత గత 122 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో కూలింగ్ ఉపకరణాల కొనుగోళ్లు నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 25% పెరిగాయి. ఈ కొనుగోళ్లలో న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచినట్టు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. కన్వర్టబుల్ ఏసీలు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుకు వినియోగదారులు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపింది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది వైఫై కనెన్టివిటీ, సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్లు ఉన్న ఏసీలకు నాలుగు రెట్లు, యాంటీ-వైరస్ టెక్నాలజీ, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్స్ ఉన్న ఏసీలకు మూడు రెట్లు, ఫాస్ట్ కూలింగ్, ఫాస్ట్ ఐస్ మేకింగ్ ఫీచర్లు ఉన్న రిప్రిజిరేటర్లకు మూడు రెట్లు, బేసిక్ రిఫ్రిజిరేటర్లకు నాలుగు రెట్ల డిమాండ్ పెరిగినట్టు ఫ్లిప్కార్ట్ వివరించింది.