శంషాబాద్, నవంబర్ 22: వెయింగ్ మెషిన్ మాటున బంగారం అక్రమంగా తరలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఓ మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె హ్యాండ్బ్యాగ్ను అధికారులు సోదాచేయగా.. వెయింగ్ మెషిన్లో దాచిన బంగారం లభించింది.
స్వాధీనం చేసుకున్న మూడు బంగారం బిస్కట్లు 350 గ్రాముల బరువు ఉన్నాయని, వాటి విలువ రూ.17,69 లక్షలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా విమానం దిగిన ఇద్దరు సూడాన్ మహిళలపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు సోదాచేయగా.. వారి బ్యాగుల్లో 13 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో బ్యాగేజీని తనిఖీ చేయగా.. తొమ్మిది ఐఫోన్లు లభించాయి. వాటి విలువ 8.37 లక్షలని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొన్నామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.