Gold Silver price : ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఒకదశలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2 లక్షలు దాటింది. కిలో వెండి ధర ఏకంగా 4.20 లక్షలకు చేరింది. కానీ గత నాలుగు రోజుల నుంచి ఈ విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్రం బడ్జెట్, ఇన్వెస్టర్లు లాభాల కోసం షేర్లను విక్రయించడం ఈ ధరల పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్గా డొనాల్డ్ ట్రంప్ కెవిన్ వార్ష్ను నామినేట్ చేయడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణమై ఉండవచ్చని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేక్ పడి పతనం మొదలవ్వడంతో కొనుగోలుదారుల్లో అంటే ముఖ్యంగా మధ్యతరగతి వారిలో ఆ లోహాలను కొనాలన్న ఆశ చిగురిస్తోంది.
ఇవాళ వెండి ధరలు 12 శాతం, బంగారం ధరలు 9 శాతం పతనమయ్యాయి. దాంతో ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090 కి దిగివచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 కు పడిపోయింది. కిలో వెండి ధర ఏకంగా రూ.2,59,000 కు పతనమైంది.
ఈ నేపథ్యంలో బంగారం, వెండి లోహాలను కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయమేనా..? అనే సందేహం వినియోగదారుల్లో నెలకొన్నది. ధరలు ఇంకా తగ్గుతాయా..? లేదంటే మళ్లీ పెరుగుతాయా అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సమీప భవిష్యత్తులో పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలు ఉన్నవారు మాత్రం ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం ఉత్తమని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు ధరలు తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందుకే బంగారంపై దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ ధరల తగ్గుదలను అవకాశంగా తీసుకోవచ్చన్నారు.