Gold raise : వెనెజువెలా పరిణామాలతోపాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం ధరలకు రెక్కలు తొడిగాయి. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. బంగారానికి పెరిగిన ‘సేఫ్ హెవెన్ డిమాండ్’ బులియన్ మార్కెట్లో జోష్ నింపింది. ఇన్వెస్టర్లు సురక్షితమైనదిగా భావించి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఫిబ్రవరి నెల గోల్డ్ ఫ్యూచర్స్ 1.47 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,37,750 వద్ద ట్రేడ్ అయింది. ఇక మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా 2.92 శాతం లాభపడి కిలోకు రూ.2,43,223కి చేరింది. అయితే 2025 డిసెంబర్ నాటి రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి.
వెనెజువెలా పరిణామాలకుతోడు, రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కూడా పసిడి ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం దేశీయంగా ధరల పెరుగుదలకు మద్దతుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1.5 శాతం పెరిగి 4,395 డాలర్లకు చేరుకుంది.
బంగారానికి రూ.1,35,550 వద్ద మద్దతు, రూ.1,38,150 వద్ద నిరోధం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా నుంచి వెలువడనున్న ఉపాధి గణాంకాలు, తయారీ రంగ డేటా వంటి కీలక నివేదికల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారని, ఈ నివేదికలు ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రభావం చూపనున్నాయని చెబుతున్నారు.
కాగా గత క్యాలెండర్ ఏడాది (2025) లో బంగారం ధర ఏకంగా 66 శాతం పెరగ్గా, వెండి 171 శాతం వృద్ధితో దానిని మించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోళ్లు జరపడం, పారిశ్రామిక కొరత వంటివి ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.