అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల టీటీడీ పాలకవర్గ సభ్యులతో పాటు, పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపింది.
నిబంధనలకు విరుద్ధంగా భారీగా బోర్డు సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్లు వాదనలు ఆరోపించారు. ఎక్కువ మంది సభ్యులను నియమించడం ద్వారా వారికి ఉండే అధికారాలతో దర్శనంతో పాటు సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. టీటీడీ స్వత్రంతను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. ఈ మేరకు ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా సభ్యుల నియామకం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.