కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సహకార రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని, అందుకు కరీంనగర్ సహకార బ్యాంకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేడీసీసీ బ్యాంకు శతాబ్ది ఉత్సవాలను మంగళవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలు ముఖ్యంగా నాబార్డు వంటి సంస్థలు నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా రుణాలు అందించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. సహకార సంఘాల్లో రాజకీయాలు చేయొద్ద ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. కార్యక్రమంలో నాబార్డు చైర్మ న్ గోవిందరాజులు చింతల, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్సీడీసీ రీజినల్ అవార్డులు
రైతులకు, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించిన ఆరు ప్రాథమిక సహకార సంఘాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) కోఆపరేటివ్ ఎక్సలెన్స్, మెరిట్ అవార్డులను ప్రకటించింది. జగిత్యాల జిల్లా పైడిమడుగు సింగిల్విండో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, వరంగల్ జిల్లా ఊకల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మహిళా సొసైటీ, నిర్మల్ జిల్లాకు చెందిన మరో మహిళా సొసైటీకి అవార్డులు దక్కాయి. అవార్డు కింద రూ.20 వేల నగదు పారితోషికాన్ని అందజేశారు.