న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మైనింగ్ దిగ్గజం వేదాంత దేశంలో తొలి సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఆయా రాష్ర్టాలతో జరుపుతున్న చర్చలు తుదిదశలో ఉన్నాయని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ రాయటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రధానంగా తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రల ప్రతిపాదనల్ని వేదాంత సమీక్షిస్తున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సెమికండక్టర్ ప్లాంటు కోసం ఉచితంగా 1,000 ఎకరాలు (405 హెక్టార్లు) స్థలాన్ని ఇవ్వడంతో పాటు విద్యుత్, నీటిని చౌకగా సరఫరా చేయాలని రాష్ట్రాల్ని కంపెనీ కోరుతున్నట్టు సమాచారం. 99 లీజుపై ఉచితంగా స్థలాన్ని సంస్థ కోరుతుండగా, 700 ఎకరాల్లో సొంతంగా తాను ప్లాంటు నెలకొల్పుతానని, మిగిలిన స్థలంలో యాన్సిలరీ యూనిట్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్రాలకు వేదాంత చెపుతున్నది. 20 సంవత్సరాలకు రాయితీతో ఫిక్స్డ్ ధరపై నీరు, విద్యుత్లను సరఫరా చేయాలన్నది వేదాంత డిమాండ్లలో ప్రధానమైనది. చిప్ ప్లాంట్లకు అధిక పరిమాణంలో నీరు, విద్యుత్ అవసరమవుతాయి. తమ ప్లాంట్లు రోజుకు 4 కోట్ల లీటర్ల నీటిని ఉపయోగిస్తాయని వేదాంత అంచనా వేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తమ చిప్ తయారీ కార్యకలాపాల ద్వారా 1,00,000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో వేదాంత వివరిస్తున్నది. అలాగే 2.2 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ.16,000 కోట్లు) పన్నుల ఆదాయం లభిస్తుందని సంస్థ పేర్కొంటున్నది. తైవాన్కు చెందిన సెమికండక్టర్ దిగ్గజం ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో వేదాంత 13.6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే దరఖాస్తును ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ఆర్థిక ఫలితాలకు విక్రయాలు దన్నుగా నిలిచాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి మధ్యకాలానికిగాను సంస్థ రూ.7,570 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5,105 కోట్లుగా ఉన్నది.ఏడాది క్రితం రూ.27,874 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గడిచిన త్రైమాసికానికిగాను రూ.39,342 కోట్లకు ఎగబాకింది.