హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టు నూతన భవన సముదాయాల కోసం 80 ఎకరాలు కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మను, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డిని గురువారం రాష్ట్ర బార్కౌన్సిల్ సన్మానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ శర్మ మాట్లాడుతూ, భూమి కేటాయింపుపై ఏజీ కృషి చేయాలని కోరారు. బార్ కౌన్సిల్కు ప్రత్యేక భవన సముదాయం నిర్మాణానికి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ చెప్పారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో కష్టంలో ఉన్న న్యాయవాదులను ఆదుకునేందుకు బార్ కౌన్సిల్ చేసిన కృషిని న్యాయమూర్తులు ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, బార్ కౌన్సిల్ వైస్చైర్మన్ సునీల్గౌడ్, తెలంగాణకు చెందిన జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు పీ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.