ముంబై : ఇంటి ముందు చెత్త వేశారని ప్రశ్నించినందుకు పొరుగింటి మహిళ చంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైన బాలిక(11) బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మన్ఖుర్ధ్ ప్రాంతంలో వెలుగుచూసింది. మైనర్ బాలిక తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు కారణమైన మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మన్ఖుర్ధ్ ప్రాంతంలోని భీమ్ నగర్లో మార్చి 6న తమ ఇంటిముందు చెత్త వేశారనే ఆగ్రహంతో తల్లీ కూతుళ్లు పొరుగింటి మహిళను ప్రశ్నించడంతో వారిపై నిందితురాలు బెదిరింపులకు దిగింది.
వాగ్వాదం కొనసాగుతున్న క్రమంలో మైనర్ బాలికను చంపుతానని మహిళ భయపెట్టింది. స్ధానికులు జోక్యం చేసుకోవడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. ఆపై సమీపంలోని బంధువుల ఇంటికి తల్లి భోజనానికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక సీలింగ్కు ఉరివేసుకుని తనువు చాలించింది. స్ధానికులు సమాచారం అందించడంతో ఇంటికి చేరుకున్న తల్లి విగతజీవిగా పడిఉన్న కుమార్తెను చూసి బావురుమంది. బాలికను కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించిందని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.