సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ మొదటి స్థాయీ సంఘం సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది. 20 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇందులో రెండు ప్రధాన ప్రాజెక్టులను ఆమోదించనున్నట్లు తెలుస్తున్నది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నాంపల్లి సరాయి పక్కన ఆధునిక రెస్టారెంట్ను పోలి ఉండేలా రూ. 11 కోట్లతో నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహిళల భద్రత దృష్ట్యా ప్రభుత్వం 187 మందికి వసతి కల్పిస్తూ అతిథి గృహం నిర్మించనుంది. దేశ, విదేశాల నుంచి వచ్చే మహిళా పర్యాటకులకు వసలి కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా చారిత్రక కట్టడమైన నాంపల్లి సరాయి పక్కన ఈ నిర్మాణం జరగనుంది.
మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో మున్సుబ్దార్గా పని చేసిన టిప్పుఖాన్ 1910లో నాంపల్లి సరాయి నిర్మాణాన్ని చేపట్టారు. ఉర్దూలో సరాయి అంటే అతిథి గృహం. నాటి అతిథి గృహమైన నాంపల్లి సనాయి స్థలం సరికొత్తగా వసతి గృహంగా మారనుంది. మహిళా పర్యాటకుల బస కోసం భారీ భవనం నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వ సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పోలీస్ విభాగంతో కలిసి ట్రాన్సిట్ డార్మ్స్ (పర్యాటకుల వసతి గృహం) నిర్మాణం చేపట్టనున్నారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లస్ ఐదంతస్తుల్లో 187 పడకలు, పరికరాలతో కూడిన కిచెన్, రెస్టారెంట్ గదుల్లో ఫర్నీచర్, మంచాలు, పరుపులు, దుప్పట్లు ఇతర సామగ్రికి రూ.11కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. భవనం సదుపాయాల కల్పనకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
ఇటీవల ఎన్నికైన నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులు 15మందితో మేయర్ అధ్యక్షతన సమావేశం బుధవారం జరగనుంది. పలు అభివృద్ధి పనులను ఆమోదిం చే అధికారం, వాటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేర్చే అధికారం స్థాయీ సంఘానికి ఉంది. మహిళా పర్యాటకుల విశ్రాంతి భవనం, జవహర్నగర్ డంపింగ్ యా ర్డు పక్కన మల్కారం చెరువును రూ. 251కోట్లతో శుద్ధి చేసే ప్రాజెక్టు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని సఫారి పార్కు నుంచి కిషన్బాగ్ రోడ్డు వరకు ప్రహరీ నిర్మా ణం, పలు చెరువుల వద్ద వరద నీటి కాలువలు, ఒప్పం ద ఇంజినీర్ల పదవీకాలం పొడగింపు , కాటేదాన్ క్రీడా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటిని ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు.