సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫ్రంట్ లైన్ వరర్లకు ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి బూస్టర్ డోస్ వేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్తో సమీక్షించారు. కరోనా థర్డ్ వేవ్ కట్టడికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మేయర్ చెప్పారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఆరు జోన్ల పరిధిలో సుమారు 500 మంది సిబ్బందిని నియమించి డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 5,26,885 గృహాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు లోకేశ్కుమార్ వివరించారు. నగరంలో 4846 కాలనీలలో రెండో డోస్ వ్యాక్సినేషన్ తుది దశకు చేరిందని చెప్పారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి పట్టణ పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు.