మెహిదీపట్నం డిసెంబర్ 28: దేశ రక్షణలో కీలకమైన ఆర్మీలో సైనికులుగా చేరడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది నిరుద్యోగ యువకులు గోల్కొండ ఆర్టీలరీ సెంటర్కు వచ్చారు. వీరు స్థానికంగా ఉండేందుకు వీలుగా వసతి, ఆహారం అందజేసి ఎంతో మందిని జీహెచ్ఎంసీ ఆదుకుంది. కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి వజీ ఉజ్జమా సిద్ధిఖీ చొరవ తీసుకుని సోమవారం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్
కమిషనర్ రవికిరణ్ను కలిసి భోజనం, మరుగుదొడ్ల వసతి
కల్పించాలని సూచించారు. స్పందించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు.
గోల్కొండ ఆర్టీలరీ సెంటర్కు వేలాది మంది నిరుద్యోగ యువకులు ఆర్మీలో చేరడానికి వచ్చారు. వచ్చేనెల 9వ తేదీ వరకు ఈ భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన వారికి భోజనం అందించడానికి జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం నుంచి చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ రెండు పూటలా భోజనం, మరుగు దొడ్లకు ఇబ్బందులు లేకుండా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయించినట్లు ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి వజీ ఉజ్జమా సిద్ధిఖీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మాతంగి రమేశ్, శివశంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సంఘం రాంలీలా మైదానంలో స్థానికులు టెంట్లు వేసి ఆశ్రయం కల్పిస్తున్నారు.